Saturday, September 17, 2011

ఒకింత వేకువ నాలో....


                                       


అవును.... ఒక సామాన్యుడిగా ఈ ప్రపంచంలో జరిగే మార్పులకు నేను మానసికంగా  సిద్ధంగా లేను. టీవీ సీరియల్లో కష్టాలకు కన్నీళ్ళు పెట్టె నేను నిజ్జంగా జరిగిన భూకంపం బాంబు పేలుళ్ళ వార్తలు మాత్రం ఒక నాటకము  చూసినట్టు చూస్తున్నాను. ఒక వేళ అదే మనం ఉన్న చోట జరిగితే నేను ఎలా ఎదుర్కోవాలో నేను ఆలోచించానా?. అసలు అవి ఎలా, ఎందుకు జరుగుతున్నాయి, వాటిని మళ్లీ జరగకుండా ఆపాలంటే మనం ఏమి చెయ్యాలి?. నాలో స్పందన శూన్యం. ఇవన్ని  నేను పాట్య పుస్తకాల్లో చదువుకోలేదు. ఎవరైనా అడిగినా ఏదో వార్తాపత్రికల్లో చదివిన జ్ఞానముతో  ఏదో సమాధానం చెపుతాము. అదంతా నిజమేనా...తెలియదు. ఒక సంఘటనకు వార్తను రాయాల్సింది బదులు, తమ అభిప్రాయాన్ని రాసే ఈ పత్రికలిచ్చే జ్ఞానం మనకు మేలు చేస్తుందా?.   మనకు ఏది పట్టదు. స్కాం జరిగితే గాని నాకు 2జి గురించిన జ్ఞానం రాలేదు. మనిషిగా మనం ఎదుగుతున్నామా దిగజారుతున్నామా? ఆపోల్లో II చంద్రుడిపై అడుగు పెట్టి అప్పుడే 
ముప్పై ఏళ్ళు దాటి పోయింది. మళ్లీ అటువంటి ప్రయత్నం  ఎందుకు జరుగలేదు? ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకులకి దాని గూర్చి ఆలోచించే సామర్థ్యం, విజ్ఞానం, చదువు కావాలి.

ఈ ప్రపంచం మొత్తం అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, పేదరికం అనే నాలుగు పాదాల దౌర్భాగ్యం. పని చేసినందుకు ఇచ్చేది జీతం, పని అయ్యినందుకు ఇస్తే బహుమతి, అదే పని చేయడానికి ఇస్తే?    అన్న హజారే చెపితే కాని అది లంచమని తెలియదు. లంచగొండి తనం ఫై చట్టం రావాలంటే తనను నరకడానికి గొడ్డలినిచ్చె చెట్టంత అమాయకత్వం మన నాయకులకు  లేదు కదా.  మరి నేను ఎప్పుడు మేల్కొంటాను? నాలో వెలుగు ఎప్పుడు వస్తుంది? అవును ఒకింత వేకువ నాలో కావాలి.

దేవుడ్ని భయంతో, పాప భీతితో కాక భక్తితో కొలిచే రోజు రావాలి. కోరికలు తీరడానికి  కాక వాటిని తగ్గించడానికి నా ప్రార్థన జరగాలి. నేను చేసే దాన ధర్మం, పుణ్యం కోసం కాక, ఎదుటివాడి అవసరాన్ని బట్టి, మరియు ఆత్మ తృప్తి కోసం చేయాలి. నాలో సమూల మార్పు రావాలి. అంటే ఆధ్యాత్మికత భావం పెరగాలి.  అవసరాలు తగ్గించు కోవాలి. 
సామాన్యంగా జీవిస్తూ గొప్పగా ఆలోచించే వైఖరి నాలో పెరగాలి. అరిషడ్వర్గము తెగనరికే ఖడ్గం కావాలి. ఇలాంటి వేకువ కోసం నా ఎదురుచూపు. అసతోమా సద్గమయా... 




     

Monday, July 4, 2011

ఆత్మసాక్షిగా......

నా ప్రయాణం అనంతం. దిగంతాల అంచులలో, అగాధాల లోయల్లో, ఎడారుల్లో, మైదానాల్లో, మనుషుల మధ్య, మనుసుల లోపల, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, బాధలు, ఆనందాలు, చావు పుట్టుకలకు మౌన సాక్షిగా, అప్పుడప్పుడు భావాలకు అతీతంగా, ఎన్నో ప్రాణులను ఒడిలో పెంచుకుంటూ, పంచుకుంటూ సాగే ఈ ప్రయాణం అలుపు లేనిది.


ఎంతో చూసాను. ఉద్యమాల్నే ఉపిరిగా చేసుకున్న గాంధీలను, స్పూర్తిగా నిలుపుకున్న పేద విద్యార్థులను, అవే ఉద్యమాలను బ్రతుకు తెరువుగా మార్చుకుని తమ అభివృద్ధికి బాటలు వేసుకున్న నాయకులనూ చూసాను. కుట్రలూ కుతంత్రాలను నా గాలి సాక్ష్యాలు నిరూపించ లేవు. నీటి బుడగల మాటలు నిలువలేవు. రూపం లేని ఆకాశం విలువలేని రూపాయి వీటి ముందు. వేదనలన్నీ కనిపించి కనిపించని పంచభూతాల్లా మిగిలిపోతున్నాయి.


నా హృదయం నిండా పెరిగే చెట్లు, కదలని రాళ్ళు, పారే నీళ్ళు, మట్టివాసనలే నా అలంకారం, నా ఆనందం ఒక వసంతం, బాధ ఒక శిశిరం, కోపం గ్రీష్మం, పంటపొలాల పండుగలే నాకు సీమంతాలు , ఆనందంగా వర్షిస్తే చిరునవ్వుల బహుమతులు. కృతజ్ఞతల కన్నీళ్లు. ఆనంద భాష్పాలవి. అందుకే నాకు ఒకటిస్తే బదులుగా వేలిస్తాను. కాని ఏమి జరుగుతోంది?.. ఆనందపు ఆనకట్టల అభివృద్దికి వరదలతో ఆనవాలు. భూమి కడుపు చీల్చి కట్టిన ఆకాశ హర్మ్యాలకు భూకంపాల జ్ఞాపకాలు. ఉపిరితిత్హుల నిండా కాలుష్యపు ఆయాసాలు, కాలేయమంతా నాగరికత tho కాలిన మరకలు, విలయతాన్డవమని మీరంటే విలాప తాడనమని నేనంటాను. నేనేమి తప్పు చేసాను. అందరికి స్వచ్చమైన ప్రాణ వాయువునివ్వడమా!!, అలసిపోతే చల్లని గాలిని, నీటిని ఇవ్వడమే పాపమా?. ఎప్పటికి అరగని ప్లాస్తిక్కుల భోజనమేనా నాకు? కరగని ఇనుపముక్కల వైద్యమా.. నన్ను కాపాడండి ..నన్ను కాపాడండి.. నేను ప్రకృతిని...మీ ఆక్రుతినే నా అస్తిత్వంగా బతుకుతున్న దాన్ని..నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించ గలరా ఎవరైనా.. కనీసం ప్రతి ఒక్క చెట్టు నాటండి. అదే నాకు మీరు చేసే ఆయుర్వేద వైద్యం...

Saturday, July 2, 2011

అందరి బంధువు



అందరి  బంధువు
 ఒకసారి కంచి స్వామి ఉత్తర దేశ యాత్రలో ఉన్నప్పుడు ఓ భక్తుడు గా ట్ట!!!. "స్వామీ ! దశావతారాలన్నీ పరిశీలిస్తే అన్ని అవతారాలు కేవలం ఉత్తరభారతం లోనే ఉన్నాయి అలాగే దక్షిణ భారతమంతా కేవలం ఎక్కువగా స్వాములు సన్యాసులు అవతరించారు ిఅంటే దేవుడికి దక్షిణ భారతం అంటే ఇష్టం లేదంటారా?" అని వింత ప్రశ్న అడిగాడట . దానికి స్వామి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట. " అయ్యా మీ పరిశీలన ఉత్తమమైనదే !. అవతారాలన్నీ దుష్ట సంహారానికి ఉద్దేశ్యించినవి అంటే దేవుడే స్వయంగా వచ్చి దండిస్తే కాని బహుశా మనుషులు మారరేమో!! అదే దక్షిణభారతం లో భక్తులు  కేవలం స్వాములు చెప్పే మంచి మాటలు,  ప్రవచానలవల్ల వారి జీవితాలు ప్రభావితం చేసుకుంటారు. అందుకే దేవుడికి అవతారాల అవసరం రాలేదనుకుంటా"...అని ముగించారు.

గురుశిష్య పరంపర మన జాతికి మూలాధారం. అడుగడుగునా మనకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని, గురువు యొక్క ప్రభావం మనమీద వారి ఆశీర్వచన రూపం లో ఉంటూ  మనకి దివిటీలా మార్గనిర్దేశం చేస్తుంది. గురువు మనసెప్పుడు మంచి శిష్యుల చూట్టునే తిరుగుతుందనిపిస్తుంది. నిజానికి ఉత్తమమైన శిష్యుల ఆత్మ బంధం నుంచి స్థితప్రజ్ఞులు, బ్రహ్మజ్ఞానులైన గురువులు కూడా తప్పించుకోలేరేమో. మనకి వీరబ్రహ్మం, సిద్దప్ప కధ విన్నాషిర్డీ బాబా కథ విన్నా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

గురువు అందరి శిష్యులకు ఆత్మ బంధువు. వారి ఆశీర్వాదం అందరికి సమానం. కానీ శిష్యుల పొందే ఫలంలో తేడా కేవలం వారి నమ్మకం, పట్టుదల,  సాధన లో వ్యత్యాసం వల్లే. ఒక గురువు తమ ప్రబోదాల్ని అందరికి సమానంగా పంచుతాడు. గురువు ప్రేమ ప్రపంచమంత విశాలం అది అందరికి మనసులో స్థానాన్ని కల్పిస్తుంది. కోపం  అగ్ని లాంటిది. అది మనం తప్పు చేస్తే దండించి మనల్ని  పునీతులుగా చేసే బడబాగ్ని. మన బాధలన్ని తనవిగా చేసుకుని, ఉపశమనం కలిగించే ధన్వంతరి. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా, ఏమాత్రం స్వార్థం లేకుండా, ఏ ఫలాపేక్ష లేకుండా   అందర్నీ అక్కున చేర్చుకుని లాలించే  వ్యక్తిత్వం కేవలం ఒక్క గురువుకే సాధ్యం.

 గురు సేవ పరమపద సోపానానికి మొదటి ఆటలోనే పెద్ద నిచ్చెన వంటిది. నిత్యం గురు స్మరణవారు ఆశయాల ఆచరణ చేసే ప్రతి శిష్యుడు ఎక్కడ ఉన్న గురువు మనసు అతడిని వెంటాడుతూనే ఉంటుంది.  అతన్ని నిత్యం కాపాడుతూనే ఉంటుంది. మానవుడికి సంస్కారమనే ఆయుధాన్ని, జ్ఞానమనే సంపదని అందించి, మన విజయమే తన పరమానందంగా భావించి, మనల్ని అసామాన్యులుగా మలచి తను సామన్యుడుగా మిగిలిపోయే  అజ్ఞాత శక్తిగురువు.  కనిపించే దైవం గురువు. మన మేలే తప్ప తన గురించి తాను పట్టించుకోని గురువుకి , మన వంతు సేవగా మనమేం చేస్తున్నాం?. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ విహార  యాత్ర  మాత్రం జరుపుకుంటాం. కాని ఒక్కరమైనా ఈ ౩౬౫ రోజుల్లో కనీసం ఒక వారం రోజులు గురు సేవలో తరిద్దామన్న ఆలోచన చేసిన వారున్నారా అని మనల్ని మనం గుండె మీద చేయి వేసుకుని అడగాల్సిన ప్రశ్న. పూర్వజన్మ సుకృతం వల్లే అది సాధ్యము. అందుకే కనీసం "గురుపూర్ణిమ" రోజైనా గురువు పాదాలకు నమస్కరించి వారి చల్లని నీడలో గడపాలని ఈ పరంపర మన సంస్కృతిలో ఒక భాగంగా మన పెద్దలు అనుసరించారు . దానికి సమయం లేని వారిని ఆ దేవుడు కూడా రక్షించలేడెమో . అమంగళం ప్రతిహతమవుగాక....   

ధ్యాన:  మూలం  గురుర్  మూర్తి:  పూజ:  మూలం  గురు  పదం
మంత్ర  మూలం  గురుర్  వాక్యం  మోక్ష:  మూలం  గురు  కృప:
                                                                                                                                                                                                                                                                        గురుపూర్ణిమ సందర్భంగా ....

Saturday, April 2, 2011

మన సమితికి దేవాలయానికి మాత్రం సంబంధం లేని ఒక భక్తుడి వెయ్యిన్నొక్క రూపాయల విరాళం తో వీణాపాణి కి ఆదరణ మొదలై మన సేవ సమితి సభ్యుల భక్తి తో అది సముద్రమంతగా మారింది. అందుకే పదహారు పేజీలతో మొదటి బులెటిన్ మొదలై సంచిక తో అది ముప్పై రెండు పేజీలుగా ఎదిగింది. ఆద్యాత్మిక వేశేషాలతో పాటుగా సాహిత్యం మరియు మన భారతీయులకే సొంతమైన ఆయుర్వేద రహస్యాలతో వేసవి బులెటిన్ సంపూర్ణంగా ముస్తాబయ్యింది. భక్తులంత తమ అమ్మతో తాము పొందే అనుభూతుల్ని తమ గురువు గారితో తమకు గల అనుబంధాన్ని అనుభావాన్లి పంచుకునే గొప్ప అవకాశంగా బులెటిన్ ఉండబోతోంది. భక్తుల నుంచియే కాకుండా ఇంకా చాల వ్యాస కర్తల నుంచి మనం ఎన్నో గొప్ప రచనలను ఆశిస్తున్నాము. వీణాపాణి మీది, మనందరిది. దీనిని ఆదరించి ఆధ్యాత్మిక ప్రపంచంలో మన జీవితాలకు ఒక మార్గదర్శనంగా మారాలంటే దీనిని మనము ప్రతి ఒక్కరం కనీసం ఒక ఐదుగురుకి పరిచయం చెయ్యాలి. రాబోయే కాలం లో వీణాపాణి ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా నిలుస్తూనే మన సేవ సమితి కార్యక్రమాలకు దేవాలయ ధర్మ ప్రచారానికి ఒక సాధనముగా, వేదికగా నిలుస్తుందని నమ్ముతూ, ......శుభంభూయాత్...

శుభారంభమే.........

శుభారంభం... చదువుల తల్లి సాక్షిగా అనంతసాగర్ సరస్వతీ క్షేత్రం వేదికగా " వీణాపాణీ" మొదటి బులిటెన్ ఆవిష్కరణ జరిగింది. పూరీ విశేష యజ్ఞం తరువాత వెంటనే సరస్వతీ bhakthulantha జరుపుకున్న మరో పండుగ అమ్మవారు పుట్టినరోజు వసంతపంచమి, దానితో పాటు దేవాలయ ఇరవయ్యో వార్షికోత్సవాలు. వీణాపాణీ కి ఇంతకన్నా గొప్ప వేదిక ఇంకేముంటుంది. వసంతపంచమి ప్రత్యేక బులిటెన్ గా వీణాపాణీ ని ఎలాగైనా విడుదల చేయాలని పూరీ లో సంకల్పించిన ఒక చిట్టి భక్తుడి కల సాకారమై అది సరస్వతీ సేవా సమితి ఆదరణ, ఆధ్వ్యరంలో పెరిగి పెద్దదవ బోతోంది.

మన సమితి కి, దేవాలయానికి ఏమాత్రం సంబంధం లేని

Saturday, January 29, 2011

సంకల్ప మాత్రేణ...........-అష్టకాల విద్యాచరణ్

ప్రతి పని ఒక సంకల్పముతో మొదలవుతుంది. సంకల్ప శుద్ధిని బట్టి దాని సిద్ధి ఆధార పడుతుంది. ఏ కార్యక్రమం అయినా మొదలెట్టేముందు మనసును ప్రశాంతంగా ఉంచి ప్రవిత్రమైన ఆలోచనలతో మొదలెడితే అది తప్పక మంచి ఫలితాలనే అందిస్తుంది. అందుకే ఏ శుభకార్యం నైనా ఇష్ట దేవతారధనతో మొదలెడతారు. ఈ ప్రతి పూజ సంకల్పం చెప్పటంతోనే మొదలవుంది. అంటే దైవపూజతో మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అంతా శుభం జరుగుతుందని దాని ఉద్దేశ్యమేమో!!!. కాకపోతే కేవలం మొక్కుబడిగా ఏ కార్యక్రమం నిర్వహించినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే పద్ధతి ఒకటే అయినా ఫలితాలు ఎంతోమందికి ఎన్నో రకాలు.


ఇదే విషయాన్ని మనం ఒక యజ్ఞం లో ఒక వ్యక్తి పాల్గొనడాన్ని బట్టి అన్వయిస్తే సరిగ్గా ఇదే భావన కల్గుతుంది. మనం కేవలం యజ్ఞంలో పాల్గొనడం అంటే అక్కడ భౌతికంగా ఉండడం సరిపోదు. మనసా కర్మణా మనల్ని మనం అక్కడ ప్రతిష్ట చేసుకుంటే ఆ ధర్మ కార్యంలో పాల్గొన్న ఫలం సంపూర్ణంగా లభిస్తుందని నా విశ్వాసం.


అయితే ఇదే నిజమైతే ఇన్ని యజ్ఞాలలో పాల్గొన్న మనకు ఎంత పుణ్యం లభించాలి?. లభించింది. కాని అది తెలుకునే జ్ఞానం రావాలంటే యజ్ఞం చేసిన ఫలితం కూడా పొందగలగాలి. ఇది ప్రతి ఒక్కరికి ఎలా సాధ్యం కావొచ్చు అన్న ఆలోచన మనసు కుదిపేసింది. అప్పుడే ఈ చిన్ని భావన కలిగింది. కేవలం సంకల్ప మాత్రేన కృత త్రేతా యుగం లో వారు ఎన్నో అద్భుతాలు సాధించారు. ప్రతి యజ్ఞం దేవతర్చనతో ప్రారంభిస్తాం. అప్పుడు యజ్ఞకర్త యొక్క సంకల్పం చెప్పేప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తమ సంకల్పాన్ని మనసులో పవిత్ర భావనతో చెప్పుకుని యజ్ఞం పూర్ణాహుతి అయ్యేవరకు మనసులో దీక్షతో "శ్రీ సరస్వత్యై ఇదం నమః" అన్న మంత్రాన్ని ఎన్ని సార్లు వీలైతే (కనీసం వెయ్యి సార్లు) నిష్ఠ తో జపం చేస్తే ప్రతి ఒక్కరికి యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందే అన్న భావం నన్నుఇలా వ్రాయడానికి ప్రోత్సహించింది. ఇలా కనీసం ఒక పదకొండు యజ్ఞాలలో వరుసగా చేస్తే అద్భుత ఫలితాలు వచ్చి మనసు మరింత మంచి కార్యాలు చేయడానికి సిద్ధమవుందని నా గట్టి నమ్మకం. ప్రయత్నిద్దాం ఇది అందరికి ఉన్న సువర్ణావకాశం.


తమ సోమా జ్యోతిర్గమయా....