Saturday, April 14, 2012

దైవం మానుష రూపేణ....

దైవం మానుష రూపేణ....


మనం ఏదో అవసరంలో ఉంటాం. అనుకోకుండా ఎవరో సహాయం చేస్తారు. మనం ఆ మనిషి  దేవుడులా వచ్చి సాయం చేసాడని  మన కృతజ్ఞతలు తెలియచేస్తాం. మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎందుకు అలా సహాయం చేసారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్పురిస్తాయి. అది మనం ఎప్పుడో ఎవరికో మనం చేసిన  సాయం వల్లో మనకీ సాయం దొరికిందని సరిపుచ్చుకుంటాం.  లేదంటే పూర్వ జన్మ సుకృతం అని సంతృప్తి చెందుతాం.  చాల మందికి రక రకాల నమ్మకాలుంటాయి. చేసే ప్రతి పనిలో కొందరి మాటను దైవంగా భావిస్తారు.  ఎందుకంటే కారణం చెప్పలేరు. అది కేవలం నమ్మకం అంతే. అలాటి నమ్మకమే దేవుడిపై మనిషుండే విశ్వాసం. ఆ నమ్మకమే మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఆ దైవభీతే మనిషిని నీతిగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆ నమ్మకమే సామన్యునితో  అద్భుతాలు చేయిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. కొందరు ఆ అదృష్టాన్ని అందుకుని అందలాలు ఎక్కితే మరి కొందరు ఆ విశ్వాసాన్ని భక్తిగా మార్చుకుని తమ జీవితాల్ని దైవసేవకు అంకితం చేసుకుని పునీతులవుతారు. మహర్షులవుతారు.


 ఏది ఏమైనా ఈ సృష్టిలో ప్రతి మానవుడి  ప్రథమ కర్తవ్యం తన  చుట్టూ ఉన్న మంచిని గుర్తించడం అది మనకు ఎంత శుభాన్ని కలిగిస్తున్నదో తెలుసుకోవడం. అది ఈ ప్రకృతి కావచ్చు, మనల్ని కాపాడే మన పెంపుడు జంతువులు కావచ్చు. అనుక్షణం మనల్ని వెన్నంటి ఉండి మన బాగు కోరుకునే  మన  జీవితభాగస్వామి కావచ్చు. నిరంతరం మన అభివృద్ధిని కాంక్షించే మన స్నేహితులు కావచ్చు, కేవలం మీరు దానం చేసే ఒక్క రూపాయి కి మీకు  వందేళ్ళ ఆయురారోగ్యాలు  కోరే మీ వీధి చివరి బిచ్చగాడు కావచ్చు. ప్రతి క్షణం మీ పని తన పనిగా చేసే మీ పనివాడు కావచ్చు. వీరంతా ఆ దేవుని స్వరూపాలే. నీవు నమ్మిన ఆ దేవుడు పంపిన దూతలే. ప్రతి ప్రాణి మరొక ప్రాణికి ఆ దైవం పంపిన సేవకులే. అవరసానికి అంది వచ్చే ఆ దేవుడి ప్రతినిధులే. సర్వం బ్రహ్మ మాయం అంటే ఇంకేదో కాదు ఇదేనేమో అని నా అభిప్రాయం. మనం చేసే మంచికి ఆనందపు ప్రసాదం, చెడుకు బాధల శటారిలు. జమాఖర్చు అన్ని సమానం. మనమంతా ఒకరికి ఒకరు దేవుడి స్వరూపాలే కాని, ఎవరికీ వారు మాత్రం కేవలం మానవ మాత్రులన్నవిషయాన్ని మనం మరిచిపోగూడదు. సాక్షాత్తు ఆ  దైవం మానవుడి అవతారం ఎత్తినపుడు మనిషిగా అన్ని విధులు నిర్వహించాడు, అన్ని కష్టాలు అనుభవించాడు. చివరకు చెడుపై విజయం సాధించాడు. దేవుడు ఈ లోక కల్యాణానికి ఎన్నో అవతారాలెత్తాడు. ఎందఱో మహానుభావుల రూపంలో ఈ మానవుల జీవితాల్ని ప్రభివితం చేసారు. అది శంకరచార్యుడైన, సాయిబాబా అయినా,  గౌతమ బుద్దుడైనా, వారంతా సామాన్యులుగా జన్మించి అసామాన్యులుగా జీవితాల్ని మలుచుకున్నవారు. వారి నందరిని  మనం దైవంగా ఆరాధించాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మన చుట్టూ అలంటి మహానుభావులెందరో.     


నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, లోకంలోని ఈ వికలాంగులు ఈ జీవ రాసులందరి తరఫున  వారు చేసిన పాపాలన్నిటికి తాము బాధ్యత  తీసుకుని, వారు ఈ అన్గావైకల్యమనే శిక్షను అందరి తరఫునా అనుభావిస్తునారేమో అని. అదే నిజమైతే, వారి విషయంలో మన బాధ్యత ఇంకా పెరగడం లేదా. వారిలో మనకు దైవం కనిపించడం లేదా? దేవుడికోసం చేసే ఎన్నో ఖర్చుల్లో కొంతైనా ఈ దైవస్వరూపాల కు చెందడంలో ధర్మం లేదా? మానవసేవ కూడా  మాధవ  సేవేనన్న గొప్ప విషయం మనకు తెలియనిది కాదు కదా. 


దైవం ప్రతిసారి, ఒకే రూపంలో ఉండకపోవచ్చు. కాని అది  అనునిత్యం అనేక విధాలుగా, మనల్ని కాపాడే అమోఘమైన ఒక శక్తి. అది దైవాన్ని పరిపూర్ణంగా, అనియమితంగా నమ్మినవారికి అడుగడుగునా సాక్షాత్కరిస్తాడు. ప్రతి మనిషిలో దర్శనమిస్తాడు. అందుకే మనం చేసే ప్రతి పనిలో మనం దైవాన్ని చూడాలి. మనం కలిసే ప్రతి వ్యక్తిలోని ఆ మహాశక్తికి  సాస్త్రాంగ నమస్కారం చేయగలగాలి. దైవం మనకు ఈరోజు, ఎరూపంలోనైనా  దర్శనం ఇవ్వవచ్చు. ఆ అపురూప ఘట్టాన్ని కోల్పోవద్దు. ఇదీ ఆ దేవుడిని కృపని పొందే మార్గమేనని గుర్తిద్దాం. జీవితాల్ని సాఫల్యం చేసుకుందాం. శుభస్య  శీఘ్రం.